అమరావతి, సెప్టెంబర్ 10: బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగు ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని తెలిపారు. ఇందుకు మనకున్న చట్ట నిబంధనలు సరిపోకపోతే, అవసరమైతే కొత్త చట్టం తెస్తామన్నారు. రేపు ఉదయానికల్లా విజయవాడ నగరంలో ఎలాంటి వరద నీరు లేకుండా చేస్తామన్నారు. ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజూ పొడిగిస్తామని తెలిపారు.ఎవరైనా ఇంట్లో లేకపోయినా.. వేరే ప్రాంతానికి వెళ్లినా వారు వచ్చాక కూడా నష్టం అంచనా నమోదు చేస్తామన్నారు. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. బుడమేరకు గండిపడి వచ్చిన నీటికి పోయే దారి లేక ఇబ్బందులు తలెత్తాయన్నారు. రేపు, ఎల్లుండి కూడా అవసరమైన చోట ఆహారం అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. కాగా.. బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ ఈరోజు ఉదయం పర్యటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... సింగ్ నగర్లో వరద ముంపు తగ్గిందన్నారు. నాలుగైదు డివిజన్లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉందన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని.. ఒక వైపు నీరు నిలవడంతో మోటార్లతో కాలువలకు మళ్లించామని చెప్పారు. రేపు (బుధవారం) సాయంత్రానికి ఎక్కడా వరద నీరు లేకుండా చేస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో చేపట్టిన సహాయక చర్యలపై వరద బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పాడైన వస్తువులు, వాహనాల విషయంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడుతుందని తెలిపారు. వాహనాల మరమ్మత్తులకు యాభై శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. పది వేల మంది కార్మికులు ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్లో ఉన్నారన్నారు. మూడు రోజుల్లో విజయవాడ పూర్తిగా యధాస్థితికి వస్తుందన్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన సర్వే రేపటితో ముగుస్తుందన్నారు. చంద్రబాబు నివేదికను పరిశీలించి బాధితులకు సాయం అందిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు.